మన దేశంలో ఇప్పుడు ఉత్పత్తవుతున్న ఆహారధాన్యాలు మన అవసరాల కంటే రెండింతలు ఎక్కువే అయినా ఆకలి, పేదరికం ఉన్నాయి. గ్రామీణ ప్రజలకి ఆదాయ భద్రత కల్పించకుండా ఆహార భద్రత అసంభవం. ఆహార భద్రత అంటే పోషకాహార భద్రత కావాలి. పర్యావరణ భద్రత కావాలి. అప్పుడే దేశానికి ఆహార భద్రత. అది కొత్త టెక్నాలజీలలో లేదు. జీవ వైవిధ్యాన్ని, పర్యావరణాన్ని, జీనవోపాధులు కాపాడుకోవడంలోనూ, ప్రకృతి వనరులను కాపాడుకోవడంలోనూ ఉంది.
మానవ మనుగడ అంతా కూడా ప్రకృతిలోని జీవజాతులని సమర్థంగా, సుస్థిరంగా వాడుకోవటంపై ఆధారపడి ఉంటుంది. ఈ జీవ వైవిధ్యంలో ఎక్కువ భాగం అభివృద్ధి చెందుతున్న దేశాలలో ఉంది. ప్రకృతి వనరులని విచ్చలవిడిగా వాడుకొని పారిశ్రామికంగా, వ్యాపారాత్మకంగా అభివృద్ధి చెందిన దేశాలు తమ భావి వాణిజ్య ప్రయోజనాలకు ఈ జీవ వైవిధ్యంపైన కన్నువేశాయి. తమ దగ్గర లేని ఈ జీవ వైవిధ్యాన్ని వాడుకోవటానికి అవకాశం, వాడుకోవటంలో వీటిపై మేధో సంబంధ హక్కులు సంపాదించుకోవటానికి పెద్ద దేశాలు ప్రయత్నించటంతో ఇరవై సంవత్సరాల క్రితం- ఈ పరస్పర వ్యతిరేక ఆలోచనలను, ఒక తాటిపైకి తెచ్చి సుస్థిర అభివృద్ధి సాధించటానికి ఐక్యరాజ్యసమితి ఆధ్వర్యంలో ‘జీవ వైవిధ్య సదస్సు’ ప్రారంభమైంది.
ప్రపంచంలో ఇప్పుడు సాగులో ఉన్న పంటలన్నీ పుట్టినవి ఎనిమిది ప్రాంతాలలో అని శాస్త్రవేత్తలు చెబుతారు. వాటిలో భారతదేశం ఒకటి. మన దేశంలో సుమారు 375 పంటలలో, 140కి పైగా పశువులలో వైవిధ్యం ఉంది. ప్రపంచ భూ విస్తీర్ణంలో భారత్ కేవలం 2.4 శాతం మాత్రమే. అయినా జనాభా 18 శాతం. ఇంతటి జనాభా ఉన్నా, మానవాళికి తెలిసిన 45వేల రకాల మొక్కలు, 91 వేల రకాల పశువులు మన దేశంలో ఉన్నాయి. ఇంతటి వైవిధ్యానికి పుట్టినిల్లు అయిన దేశంలో మనం ఈ జీవ వైవిధ్యాన్ని త్వరితగతిన కోల్పోతున్నాం. అం దుకు ఈ జనాభా పెరుగుదల, అభివృద్ధి అవసరాలు కారణం అని ప్రభుత్వం చెబుతున్నా, విశ్లేషణలు అన్నీ కూడా ప్రభుత్వం ఎంచుకున్న తప్పుడు విధానాలే కారణమని స్పష్టం చేస్తున్నాయి. ఆధునిక వ్యవసాయం పేరుతో జరిగిన /జరుగుతున్న విధ్వంసం కావచ్చు, ప్రాజెక్టుల నిర్మాణాలు కావొచ్చు, గనుల తవ్వకాలు కావచ్చు లేక పారిశ్రామికీకరణ పేరుతోనో, పట్టణీకరణ పేరుతోనే కావొచ్చు ప్రభుత్వ ఆధ్వర్యంలోనే ఈ విధ్వంసం కొనసాగుతూ ఉంది. ఇలాంటి విధ్వంసకరమైన అభివృద్ధికి వ్యతిరేకంగా చాలా ప్రాంతాలలో ప్రజలు తిరగబడుతూనే ఉన్నారు. స్థానిక జీవనోపాధులకు ఇలాంటి అభివృద్ధి ముప్పు అని గుర్తించి పోరాటం చేస్తున్నారు.
జీవ వైవిధ్యాన్ని ఆహార, వాణిజ్య, పారిశ్రామిక అవసరాల కోసం వ్యవసాయ రంగంలోనే ఎక్కువ వాడుకుంటాం. జీవ వైవిధ్యానికి ముప్పు వాటిల్లటంతో వ్యవసాయరంగానికి పెద్ద ముప్పు, తద్వారా మన ఆహార భద్రతకు పెనుముప్పు ఏర్పడే అవకాశం ఉంది. మన దేశ వ్యవసాయంలో ఒకప్పటి జీవ వైవిధ్యం: వరి- లక్ష రకాలు; మామిడి- 1000 రకాలు; జొన్న -5000 రకాలు; వంగ- 3500 రకాలు; ఆవులు -27జాతులు; మేకలు -22 జాతులు; గొర్రెలు-40 జాతులు; కోళ్ళు- 18 జాతులు; గేదెలు-ఎనిమిది జాతులు.
ప్రపంచంలో సహజంగా ఉండే మొక్కల్లో కొన్ని మొక్కలను తన అవసరాలకు వాడుకోవచ్చని మానవుడు గుర్తించటంతో వ్యవసాయం, తద్వారా స్థిర జీవనం, గ్రామాల అభివృద్ధి ప్రారంభమయ్యాయి. మన దేశంలో ఉన్న వివిధ ప్రాంతాల్లో భౌగోళిక పరిస్థితులు, వివిధ అవసరాల కోసం అనువైన వంగడాలు, వ్యవసాయ పద్ధతులు కాలక్రమేణా అభివృద్ధి చెందాయి. మన అవసరాలకు వాడుకుంటున్న పంటలన్నింటినీ మూడు వేల సంవత్సరాల క్రితమే సాగులోకి తెచ్చారు. ఆ తర్వాత ఇప్పటివరకు ఒక్క కొత్త పంటని కూడా మానవ జాతి కనుక్కోలేకపోయింది.
అయితే ఆధునిక వ్యవసాయం పేరుతో మనం ఎంచుకున్న విధానాలు ఈ వైవిధ్యాన్ని నాశనం చేస్తున్నాయి. మనకు స్వాతంత్య్రం వచ్చేసరికి మన ఆహార అవసరాలకు అనేక పంటలు ఉన్నా, కేవలం కొన్ని పంటలపై దృష్టి పెట్టడం వల్ల మిగిలినవి కనుమరుగైపోయాయి. ఆహారధాన్యాలు అంటే ఈ రోజు మనకు తెలిసినది కేవలం వరి, గోధుమ మాత్రమే. వీటికంటే ఆరోగ్యకరమైన చిరుధాన్యాలు ఈ రోజు సాగులో లేవు. వరి, గోధుమ సాగు పెరగటం వలన నీటి వినియోగం పెరిగింది. ఒక కిలో వరి బియ్యం పండటానికి దాదాపు 5000 లీటర్ల నీరు అవసరం; అదే జొన్న, సజ్జ లాంటి చిరుధాన్యాలకైతే కేవలం 200 లీటర్ల నీరు సరిపోతుంది.
ఇలా పంటల సరళిలో మార్పురావటం వలన నీటి వినియోగం పెరిగి భూగర్భ జలాలు తరిగిపోయాయి. అలాగే పెద్ద విస్తీర్ణంలో ఒకే పంట వేయటం వలన పురుగులు, తెగుళ్ళ సమస్యలు, ఒకే పంటను మరలా మరలా భూమిలో సాగుచేయటం వలన భూసారం కోల్పోవటం జరుగుతోంది. దీనివలన పురుగు మందుల వినియోగం, రసాయనిక ఎరువుల వినియోగం పెరుగుతోంది. అలాగే మన రాష్ట్రంలోని ఒంగోలు జాతి ఆవులు కానీ, పుంగనూరు ఆవులు కానీ, దక్కనీ గొర్రెలు కానీ, అసిల్ కోళ్ళు కానీ అన్నీ మన ప్రాంతాలకి అనువైనవి. వాటిని ప్రోత్సహించకుండా కేవలం బయట దేశాల నుంచి తెచ్చిన వాటినే ప్రోత్సహించటం జరుగుతోంది.
ఎక్కడ తప్పు చేశాం? చారిత్రకంగా చూస్తే చాలా రకాల పంటలు మన దేశంలోనే ఉద్భవించటంతో పాటు స్థానిక వనరుల ఆధారంగా వివిధ అవసరాల కోసం సాగు పద్ధతులు, పంట రకాలు ఉన్నట్టు తెలుస్తోంది. అయితే ఆధునిక వ్యవసాయం పేరుతో మనం అమెరికా వ్యవసాయాన్ని అనుకరించే ప్రయత్నాలు చేయటంతో కష్టాలు మొదలయ్యాయి. వరి మనకి ముఖ్యమైన ఆహార పంట. క్రీ.శ. 1700 ప్రాంతాలలోనే తమిళనాడులోని చెంగలప్పట్టు జిల్లాలో వరి దిగుబడులు హెక్టారుకి 9 టన్నులు ఉన్నట్టు తెలుస్తుంది. అయితే మెట్ట ప్రాంతాల్లో, కొండ ప్రాంతాల్లో సాగు పద్ధతులు, రకాలు వేరుగా ఉండేవి. వాటికి అనుగుణంగానే దిగుబడులు ఉండేవి.
స్వాతంత్య్రం వచ్చే నాటికి మన దేశంలో 50 వేల రకాల వరి వంగడాలు సాగులో ఉండేవి. అందులో సుమారు 55 శాతం మెట్ట వరి రకాలు. హరిత విప్లవం పేరుతో మనం వీటన్నిటిని నాశనం చేసి నీటి ముం పుతోటే పండించే కొన్ని అధిక దిగుబడి రకాలను ప్రోత్సహించాం. దీని వలన ఈ వైవిధ్యం అంతా కోల్పోయి ఈ రోజు మన దేశంలో దాదాపు 85 శాతం వరి కేవలం పది రకాల నుంచి మాత్రమే వస్తుంది. అంటే ఆశ్చర్యపడాల్సిందే. వరదలను తట్టుకునే రకాలు, కరువుని తట్టుకునే రకాలు, ఉప్పు నీటిని తట్టుకునే రకాలు అనేకం ఉండేవి. అలాగే ఎక్కువ విటమిన్లు, పోషకాలు ఉన్న రకాలు కూడా సాగులో ఉండేవి. అయితే ఇప్పుడు అవే లక్షణాలను జన్యుమార్పిడి ద్వారా ప్రవేశపెట్టటానికి ప్రయత్నాలు చేస్తున్నారు.
మనకి పోషకాలు కావాలంటే ఆహారంలో వైవిధ్యం ఉండాలి కానీ ఒక్క వరిలోనే అన్ని పోషకాలు ఉండేలా చేయాలి అనుకోవటం మూర్ఖత్వం. ప్రభుత్వ పరిశోధనలు, సబ్సిడీలు, మద్దతు ధరలు అన్నీ వరికి మాత్రమే సహకారం అందిస్తూ ఉండటంతో తృణ ధాన్యాల సాగు క్రమేపీ తగ్గుతూ ఇప్పుడు పూర్తిగా కనుమరుగవుతోంది. పోషకాల పరంగా చూస్తే వరి వీటికి ఏ మాత్రం సాటిరాదు. పైగా నీటి వినియోగం కూడా తక్కువ. పోషకాలు ఎక్కువగా ఉండే పంటలను ప్రోత్సహించకుండా ఇప్పుడు ‘గోల్డెన్ వరి’ పేరుతో జన్యుమార్పిడి వరి తేవటానికి ప్రయత్నం జరుగుతోంది. వరిలో విటమిన్ బి తయారీకి అవసరమైన బీటా కేరాటిస్ ఉత్పత్తి అయ్యేలా, అలాగే ఎక్కువ ఐరన్ ఉండేలా జన్యుమార్పిడి పంటలను తయారుచేస్తున్నారు. కొన్ని పంటలను, వాటిల్లో కేవలం కొన్ని రకాలు, కొన్ని రకాల పండించే పద్ధతులను మాత్రమే ప్రోత్సహించటం వల్లే సమస్యలు వస్తున్నాయని గుర్తుంచుకోవాలి.
యాంత్రికీకరణకు అనుగుణంగా పంట రకాలు, వ్యవసాయ పద్ధతులు మార్చుకోవటం ఇంకో పెద్ద సమస్య. దీనికి పత్తిని ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ప్రపంచం అంతా ఆకులూ, చర్మాలూ కట్టుకునే రోజుల్లో మన దేశంలో పత్తి సాగులో ఉండేది. ప్రపంచ దేశాలన్నిటిలోనూ మొహంజోదారో నాటి నుంచి మన దేశం బట్టలకు ప్రసిద్ధి. అయితే పారిశ్రామిక విప్లవం తర్వాత వచ్చిన స్పిన్నింగ్ మిల్లులకై, బ్రిటన్కు పత్తి ఎగుమతి చేయటం కోసం అమెరికన్ పొడుగు పింజ పత్తిని ప్రవేశపెట్టారు. దేశీయ పత్తి మెట్ట ప్రాంతాలలో పండేది. పురుగు- తెగుళ్ళ సమస్య తక్కువ అయితే, ఈ అమెరికన్ పత్తి పంటకు నీటి వినియోగం ఎక్కువ.
పైగా పురుగుల-తెగుళ్ళ సమస్యలు ఎక్కువ. ఈ అమెరికన్ పత్తులతోనే, ఇప్పుడు వ్యవసాయరంగంలో పెద్ద ఎత్తున వినాశనానికి కారణంగా వున్న ‘పచ్చ పురుగు’ (దీనిని అమెరికన్ బోల్ వార్మ్ అని అంటారు) వచ్చింది. వాటిని నియంత్రించటానికి రసాయనిక పురుగు మందులు, వాటికి తట్టుకునే శక్తి పెంచుకుంటే ఇంకా విషపూరితమైన పురుగు మందులు, ఇప్పుడు జన్యుమార్పిడి పత్తి ఇలా సమస్యకి తప్పుడు పరిష్కారాలు వెతుకుతుంటూనే ఉన్నాం. నిజానికి దేశీయ పత్తి రకాలని అభివృద్ధిచేసి, దానికి అనుకూలంగా స్పిన్నింగ్ యూనిట్లు తయారుచేసి ఉంటే సమస్య చాలా మటుకు తక్కువ ఉండేది. అలాగే పురుగుమందుల వాడకం పెంచుకుంటూ పోవటం, జన్యుమార్పిడి పంటలను అభివృద్ధి చేయటం లాంటివి కాకుండా స్థానిక వనరులతో చేసిన సుస్థిర వ్యవసాయ పద్ధతులను ప్రోత్సహిస్తే ఖర్చులు తగ్గటంతో పాటు జీవ వైవిధ్యాన్ని కూడా కాపాడుకున్న వారమవుతాము.
ఆధునిక వ్యవసాయంతో వచ్చే సమస్యల గురించి మాట్లాడినప్పుడల్లా ఆహారభద్రతకు ఇదే దారి అని వాదనలు వినిపిస్తున్నాయి. ఈ రోజు మన దేశంలో సుమారు 25 కోట్ల టన్నుల ఆహారధాన్యాల ఉత్పత్తి జరుగుతోంది. మన దేశ జనాభా 130 కోట్లు. అందరూ మూడు పూటలా భోజనం చేస్తారు అనుకున్నా మనకు కావలిసింది 9.5 కోట్ల టన్నుల ఆహారధాన్యాలు మాత్రమే (ప్రతి వ్యక్తికీ రోజుకు 200గ్రాముల లెక్క తీసుకుంటే). అంటే ఇప్పుడు ఉత్పత్తవుతున్న ఆహారధాన్యాలు మన అవసరాల కంటే రెండింతలు ఎక్కువ. అయినా దేశంలో ఆకలి, పేదరికం ఉన్నాయి. ప్రజలకి, ముఖ్యంగా వ్యవసాయం మీద ఆధారపడి జీవిస్తున్న గ్రామీణ ప్రజలకి ఆదాయ భద్రత కల్పించకుండా ఆహారభద్రత అసంభవం.
అలాగే ఆహార భద్రత అంటే కేవలం వరి, గోధుమ కాదు. తిండి గింజలు మాత్రమే కాదు. పోషకాహార భద్రత కావాలి. పర్యావరణ భద్రత కావాలి. అప్పుడు దేశానికి ఆహార భద్రత. అది కొత్త టెక్నాలజీలలో లేదు. వైవిధ్యాన్ని, పర్యావరణాన్ని, చిన్న సన్నకారు రైతుల, రైతు కూలీల జీనవోపాధులు కాపాడుకోవడంలోనూ, ప్రకృతి వనరులను కాపాడుకోవడంలోనూ ఉంది.
- జి.వి.రామాంజనేయులు
సుస్థిర వ్యవసాయ కేంద్రం (సీఎస్ఏ) ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్,
వీణ రావు
సీఎస్ఏలో పరిశోధకురాలు
(నేడు ఆహార భద్రతా దినోత్సవం)